1, జనవరి 2012, ఆదివారం

ఒడిదుడుకులతో గట్టెక్కిన 'ఐటి'

సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు... నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ (ఐటి) చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం, ఎగుమతుల విలువ రూ. 36 వేల కోట్లకు చేరుకోవడం ఈ ఏడాది చెప్పుకోదగ్గ విశేషాలు. రాష్ట్రంలో వేగంగా విస్తరించిన ఐటి పరిశ్రమ ద్వారా 2 లక్షల మందికి నేరుగా, దాదాపు 12 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే స్థాయికి ఈ ఏడాది ఐటి పరిశ్రమ చేరుకుంది. అలాగే, హైదరాబాద్‌తో పాటు విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, కాకినాడ, వరంగల్‌ నగరాలలోనూ కొత్తగా ఐటి కారిడార్‌లు విస్తరించాయి. కాగా, ఇదే సమయంలో ఉద్యోగాలు ఇస్తామంటూ కొన్ని ఐటి కంపెనీలు నిరుద్యోగులను ఆకర్శించి శిక్షణ ఇస్తామని ఆశ చూపి డిపాజిట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి అడ్రస్‌ లేకుండా పోయిన సంఘటనలు సైతం ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. ఈ దృష్ట్యా ఐటి కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముగ్గురు ప్రభుత్వ కార్యదర్శులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
రైతులకు ప్రతి నిత్యం అవసరమయ్యే సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని నివారించేందుకు ఐటి శాఖ ఈ ఏడాది మీ సేవ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ సంతకాలతో ముందుగానే ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో సర్టిఫికెట్ల జారీని ప్రయోగాత్మకంగా చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ప్రారంభించారు. 2012 మార్చి నాటికి ఈ సేవలను రాష్ట్రమంతటా విస్తరింపజేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. 2014లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అంతర్జాతీయ సాఫ్ట్‌వెర్‌ ఇంజనీరింగ్‌ సదస్సును నిర్వహించేందుకు ఈ మేరకు సదస్సు స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధులు మంత్రి పొన్నాల ఎదుట ప్రకటించారు. ఇక ఇంజనీరింగ్‌ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను సాంకేతికంగా మరింత ప్రతిభావంతంగా తీర్చిదిద్దేందుకు అమెరికాకు చెందిన ఆటో డెస్క్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ ముందుకొచ్చింది. 2015 నాటికి రూ. 70 వేల కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని ఐటి శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుగా రూపొందించిన చిప్‌తో హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర ఐటి శాఖ సాధించిన విజయాలలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాన్ని విస్తృత పరిచే కార్యక్రమంలో భాగంగా రూ. 2380 కోట్లతో ప్రతిపాదించిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌ మెంట్‌ రీజియన్‌ (ఐటిఐఆర్‌)కు కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం లభించడం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా, నగరంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించేలా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇటీవల వరుసగా రాష్ట్రంలో ఐటి కంపెనీలు మూత పడుతూ అభ్యర్థులను ఆర్థికంగా, మానసికంగా నష్టానికి గురి చేస్తున్నందున వీటిని అరికట్టేందుకు ఐటి శాఖ, పరిశ్రమల శాఖ, న్యాయ శాఖ కార్యదర్శులతో పాటు ఇట్స్‌ ఎపి ప్రతినిధులను సభ్యులుగా చేస్తూ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుతో ఐటి కంపెనీల అక్రమాలను నియంత్రించేందుకు, నిరుద్యోగ యువతను మోసం చేసిన సందర్భంలో చర్యలు తీసుకునేందుకు వీలు కలిగింది. జాతీయ ఐటి ఎగుమతులలో రాష్ట్రం వాటా 15 శాతం ఉండగా, అలాగే ఉపాధి అందించే విషయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం వాటా 12 శాతానికి చేరుకుంది. సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువుగా తీసుకునే లక్ష్యంతో పారదర్శకత, త్వరితగతిన పనులు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ-డిస్ట్రిక్ట్‌ పనులకు నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దేశవ్యాప్తంగా 640 జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు రూ. 1663 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మన రాష్ట్రానికి రూ. 88 కోట్లు అవసరం కాగా, 25 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించిన ప్రోత్సాహం, మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీసుకున్న చొరవతో ఈ ఏడాది బహుళ జాతి కంపెనీలు తమ కార్యాలయాలను ప్రారంభించడం ఈ ఏడాది చెప్పుకోదగ్గ అంశం.