1, జనవరి 2012, ఆదివారం

రోజుకు రూ.81.50 లక్షల నష్టం 2011 ..ఆర్టీసీ

ఆర్టీసీకి ఈ సంవత్సరం ఏ మాత్రం కలిసి రాలేదు. ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సంస్ధ పయనం సాగింది. కొత్త బస్సుల కొనుగోలు ప్రయాణికులు, సర్వీసుల క్రమబద్దీకరణతో కార్మికులకు కొంత వరకు ప్రయోజనం కలిగినప్పటికీ సంస్ధ మాత్రం ఆర్ధికంగా ముందడుగు వేయలేక పోయింది. ఆదాయం, వ్యయం పెరుగుదలతో పాటుగా అప్పులు కూడా పెరిగాయి. ఆర్టీసీ రోజుకు రూ. 81.50 లక్షల నష్టాలతో నడుస్తుంది. సంస్ధ నష్టాలు ఇప్పటికే రూ. 2,300 కోట్లు దాటాయి. ఈ సంవత్సరం రూ. 296.66 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆర్టీసీ 22,289 బస్సులు కలిగి ఉంది. దాదాపు 1.22 లక్షల మంది ఉద్యోగులు సంస్ధలో పనిచేస్తున్నారు. రోజుకు 1.34 కోట్ల మందిని సురక్షితంగా తమ గమ్యం చేర్చడానికి ఆర్టీసీ బస్సులు ప్రతి నిత్యం 81.50 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఆర్టీసీని బలోపేతం చేయడానికి యాజమాన్యం నిరంతర కృషి కొనసాగిస్తునే ఉంది. ప్రయాణికులను ఆకట్టుకోవడానికి వినూత్న పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా గ్రామీణ మహిళలను ఆకట్టుకునేందుకు వనితా కార్డును ప్రవేశ పెట్టింది. దూర ప్రాంతం ప్రయాణం చేసే మధ్య తరగతి వర్గాలకు ఇంద్ర బస్సులను ప్రారంభించింది. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని సరి కొత్త విధానాలను ప్రకటిస్తుంది. అయినప్పటికీ ప్రైవేటు పోటీని తట్టుకోలేక పోతుంది. ప్రయాణికులను ఆకర్శించడంలో ఆశించిన ప్రగతిని సాధించలేక పోయింది. ప్రైవేటు ఆపరేటర్ల పోటీ, ఉద్యమాలు ఆర్టీసీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టాయి.
ప్రభుత్వానికి వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నులు కూడా ఆర్టీసీని కృంగదీస్తున్నాయి. దాదాపు 12 వేల మంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించడం ఆర్టీసీకి భరించలేని భారంగా తయారైంది. ఈ సంవత్సరం కొత్తగా 4 వేల బస్సులను ప్రవేశపెట్టడానికి సాహసోపేతంగా నిర్ణయం తీసుకుంది. అందులో ఇప్పటికే 2700 బస్సులు రోడ్లపైకి వచ్చాయి. ఇంధన పొదుపులో కూడా అవార్డులు పొందింది.
మోటారు వాహనాల పన్నులు, ముడిసరుకులపై వసూలు చేస్తున్న 14.5 శాతం విలువ ఆధారిత పన్ను, టోల్‌ టాక్స్‌, డీజిల్‌పై చెల్లిస్తున్న పన్నులు ఆర్టీసీకి పెనుభారంగా పరిణమించాయి. ఆర్టీసీ గత కొంత కాలంగా డీజిల్‌పై రాయితీ కోరుతుంది. వ్యాట్‌ తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. మోటారు వాహనాల పన్ను నుండి సంస్ధను మినహాయించాలని కోరింది. ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఏటా రూ. 750 కోట్ల వరకు సహాయం అందించాలని బెంగుళూరు ఐఐటి నిర్వహించిన అధ్యయన నివేదిక సిఫారసు చేసింది. ఆర్టీసీని బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఆశించిన మేరకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే బస్సుల కొనుగోలుకు రూ. 200 కోట్లు ఇస్తామని ప్రకటించి, రూ. 100 కోట్లకు మించి విడుదల చేయని పరిస్ధితి నెలకొంది. ఫలితంగా ఆర్టీసీ ఆర్ధిక పరిస్ధితి దిగజారింది. కోలుకోవడం కష్టమనే విధంగా అప్పులు రూ. 2,500 కోట్లకు చేరుకోబోతున్నాయి. అంతర్గత వనరుల వృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా సానుకూల ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి.
ఆర్టీసీ 20 వేల గ్రామాల్లో తిప్పుతున్న 12 వేల పల్లె వెలుగు బస్సులు నష్టాలతోనే నడుస్తున్నాయి. సామాజిక బాధ్యతతో కొన్ని రూట్లలో నష్టాలు భరించి బస్సులు నడపాల్సి వస్తుంది. ఆర్టీసీ ఎంతగా ప్రయత్నించినా ఆక్యుపెన్సీ రేషియో 63 నుండి 69 మధ్యనే ఉంటుంది. 2008 -09 ఆర్ధిక సంవత్సరంలో ఆర్టీసీ రూ. 110 కోట్ల లాభాలను ఆర్జించింది. 2008 -10లో రూ. 514 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ. 300 కోట్ల నష్టాలు ప్రకటించారు. అప్పులు కూడా అదే స్ధాయిలో పేరుకు పోతున్నాయి. ప్రైవేటు పోటీని తట్టుకొని బస్సులను నడిపించడం తప్ప ఆర్టీసీకి మరో మార్గం కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ వనరుల పెంపుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రణాళికలు వేగవంతం చేయడం ఆర్ధిక పరిపుష్టికి మరో మార్గంగా పేర్కొంటున్నారు.