15, నవంబర్ 2011, మంగళవారం

క్రియా హీనం...భక్తి హీనం...గణాధిపా

ఉప్పొంగిన భక్తి భావం, జై బోలో గణేష్ మహరాజ్‌కీ గణపతి బప్పా మోరియా... నినాదాలు... భిన్న సంస్కృతులు మేళ వింపుతో జరిగే వినాయక నిమజ్జన ఊరేగింపులు ఆద్యంతం ఆబాల గోపాలాన్ని ఆకర్షించేలా సాగుతాయి.
బాజా భజంత్రీలు, డప్పుల చప్పుళ్లు, హోళీని మించి రంగు రంగులు చల్లుకుంటూ ఆకట్టుకునేలా యువతీ యువకుల ఆట పాటలతో అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవాలు పూర్తయినా ఆపై సాగర జలాల ప్రక్షాళన కోసం, ఇనుప ముక్కల కోసం గణనాధుల్ని తొక్కుకుంటూ... విరగ్గొడుతూ... కనిపించే సన్నివేశాలు... మహాగణపతీ మమ్ములను క్షమించు అనుకునేలా ఉంటున్నాయి.
విగ్రహాలతో పాటు నిమజ్జనమై పోయిన వారు కొందరైతే...అవాంఛనీయ ఘటనలకు బలైపోయిన వారు మరి కొందరు. ఈ సారైనా ఇలాంటివి చోటు చేసుకుండా ఉండాలని కాంక్షిస్తూ... రానున్న రోజుల్లో పర్యావరణ రక్షణ ధ్యేయంగా వినాయక ప్రతిమల ప్రతిష్టలకు నిర్ణయం నేడే జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
''మట్టి వినాయకుడ్ని పూజిద్దాం - పర్యావరణాన్ని కాపాడుదాం'' నినాదానికి ప్రజలు స్పందించి, అందుకు అనుగుణంగానే ఈ ఏడాది మట్టి ప్రతిమల్ని చవితి రోజున పూజించారు. మన రాజధాని భాగ్య నగరంలో వీధికో విగ్రహం చొప్పున 45వేల మండపాలు వెలిసి గణప తుల్ని కొలువుదీర్చగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు, వర్గాలు, కులాలు లెక్కన విడిపోయి పోటా పోటీగా తమ విఘ్నాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరుడ్ని తీసుకొచ్చిన సందర్భాలనేకం.
హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ గణపతి 54 అడుగులతో దర్శనమిస్తే, అంతకు రెట్టింపు ఎత్తులో'విశాఖ తీరంలో కొలువుదీర్చారు. గత తొమ్మిది రోజులు గా 'విఘ్న' రాజుని తనివితీరా పూజలు జరిపించిన నిర్వాహకులు, ఎందరో కళాకారులు రేయింబవళ్ళు శ్రమించి తయారు చేసిన లక్షలాది విగ్రహాల నిమజ్జనం చేసేందుకు ఉత్సాహభరితంగా సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు పూడికతీతకు నోచుకోక నీరసిస్తున్న మన చెరువు లకు ఇన్ని విగ్రహాలను జీర్ణించుకునే స్థితి ఉందా? అంటే లేదనే జవాబు విని పిస్తుంది. వీటిలో మట్టి విగ్రహాలకు తోడుగా అనేక రసాయనాలతో కూడిన 'ప్లాస్టరాఫ్‌ పారిస్‌' విగ్రహాలు నిమజ్జనమయ్యేందుకు కదిలి వస్తున్నాయి.
ఇన్నాళ్ళు వేలు, లక్షల ఖర్చుతో కొన్ని వేల యూనిట్ల విద్యుత్‌ని వాడి ధగధగ విద్యుత్‌ కాంతుల నడుమ ప్రశాంతంగా సేద తీరిన గణపతి బప్పాలలో ఇప్పటికే 5,7 రోజులకే నిమజ్జనాలు జరిగాయి. నవరాత్రులు పూర ్తవటంతో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని అనేక చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు కోసం వేలాది మంది కార్మికులను, వందలాది క్రేన్లను వినియోగిస్తు భారీ ఏర్పాట్లు చేసారు. అలాగే రాష్ట్రం లోని పట్టణాలు, గ్రామాల సమీపంలో ఉండే నదుల్లో, సముద్ర తీరాల లో గణపతుల్ని నిమజ్జనం చేస్తారు.
నిమజ్జనం ఎందుకు..?
వర్షాకాలంలో వచ్చే చవితి పండుగ మానవాళి శ్రేయస్సుకు, ఉషస్సుకు ఉపయోగపడాలని.. సారవంతమైన మట్టికి గణపతి రూపమిచ్చి, విఘ్నాలను తొలగించమని వేడుకుంటూ.. ఔషధ గుణాలున్న 21 పత్రులతో పూజించే వారు మన పెద్దలు. కలుషితమైన చెరువులు, బావు లు, నదులు ప్రక్షాళనకి గణపతి దేవుళ్ళని పత్రితో పాటు నిమజ్జనం చేస్తే, ఇవి నీటిపై ప్రభావం చూపి క్రిమికీటకాలను పారద్రోలి స్వచ్ఛత చేకూరు స్తాయన్న విశ్వాసంతో వినాయక చవితి, దసరా సమయాలలో నిమజ్జ నాలు చేసేవారు. దీనివల్ల యావత్‌ ప్రజలకు స్వచ్ఛమైన నీరందించి, వర్షాభావం వల్ల ప్రబలే రోగాలను నివారించవచ్చన్న మేధోత్తమ చర్యలో భాగమే నిమజ్జనమన్నది పూర్వీకుల విశ్వాసంగా నేటికీ పెద్దలు చెబుతారు.
నిమజ్జనం చేయని వారు పూజించిన విగ్రహాలను నవరాత్రులు కాగానే పెరటిలోని చెట్ల మధ్యనో, తులసికోటలోనే ఉంచేవారు. పత్రిరోజు మొక్కలపై నీళ్ళు పోసినప్పుడు వినాయక విగ్రహాలు కరిగి, ఆ మొక్కలకు సారవంతమైన మట్టిని అందిస్తే, ఔషధ గుణాల పత్రి మొక్కలని చీడపీడల నుంచి రక్షించేందుకు ఉపయోగపడుతుంది.
కాని జరుగుతుందేమిటి?
విఘ్నాలు తొలగించాలని మనం పూజించిన గణపతులను మన ఆరోగ్యాన్ని కాటేసేలా తయారు చేస్తున్నాం.. నిషిద్ధపదార్థాలతో 'కళా హృదయం' పేరిట కరగని ఎన్నో వస్తువులతో వినాయక ప్రతిమల్ని రూపొందిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించే పని అని తెలిసినా, విషపూరిత రంగులు, రసాయనాలతో విగ్రహాలను తయారుచేసి నిమజ్జనంతో నీటిని మరింత కలుషితం చేస్తున్నాం. 'ప్రక్షాళన'కు ఉపయోగపడే విగ్రహాల స్ధాðనంలో వ్యర్ధ పదార్ధాలతో అనేక రూపాలతో గణపతుల్ని రూపొందించిన మనం.. అనేక రకాల పనికిరాని మొక్కలు తోడవటంతో ప్రాణాలు తీసే హాలాహలాన్ని మనం తయారు చేసు కుంటున్నాం.
లడ్డూలు - వివాదాలు
ఈ ఏడాది గణపతి మండప నిర్వాహకులు పోటాపోటీగా భారీ విగ్రహాలకెంత ప్రాధాన్యతనిచ్చారో అదే స్థాయిలో లడ్డూకీ ఇచ్చారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ గణపతికి 2200 కిలోల లడ్డూ ఓ భక్తుడు సమర్పిస్తే, విశాఖలో గణపతికి ఏకంగా 6,500 కేజీల లడ్డూ ఇచ్చారు. ఈ రెండింటిని తయారుచేసే అదృష్టం తాపేశ్వరం 'సురుచి' స్వీట్స్‌ దక్కించుకోగా, నిమజ్జనం తర్వాత వీటికి ప్రసాదంలాగే పంచి పెట్టడం ఇబ్బందే.
ఇక గణపతుల చేతుల్లోని లడ్డూలకి ప్రాధాన్యత పెరిగిపోతోంది. 'బాలాపూర్‌' గణపతి లడ్డూ వేలంలో గత ఏడాది వివాదాలు చోటుచేసు కున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో గణపతి లడ్డూ వేలం బాట పట్టాయి. తద్వారా వచ్చే ఆదాయాన్ని మరుసటి ఏడాది ఉత్సవాలకు వినియోగిస్తుండటంతో.. 'చందాల'భారం తప్పిందని సామాన్యజనం ఆనందిస్తున్నారు.
పోటీలో పడి భారీగా తయారు చేస్తున్న విగ్రహాలను సముద్రుడు కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. విశాఖ సాగర్‌ తీరంలో నిమజ్జనం అనంతరం దృశ్యాలు చూస్తే కడుపు తరిగిపోతుంది. నిన్నటి వరకు పూజలందుకున్న వినాయకులను చిన్నాభిన్నం చేసే పనిక బుల్‌డోజర్లు సైతం వినియోగిస్తూ, హృదయ విదారకర సన్నివేశాలు దర్శనమిస్తాయి.
ఇక విగ్రహాల తయారీలో వాడే ఇనుము కోసం వందలాది నిర్భాగ్యులు మనకిక్కడ దర్శనమిస్తారు. టన్నుల కొద్ది లభించే ఈ పాత ఇనుము కోసం 'సాగర్‌' పరిసర ప్రాంతాల్లో పాత ఇనుప వ్యాపారులు లారీలతో సిద్ధంగా ఉంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. రాష్ట్రంలో నిమజ్జనం జరిగే ప్రతిచోటా ఇలాంటి తంతే కనిపిస్తుంది.
ఇకనైన గణేష్ ‌ మండపాల నిర్వాహకులు తమ 'భారీ'తనా లను తగ్గించుకుని చిన్నపాటి మట్టి విగ్రహాలకు చోటు కల్పిస్తే, క్షణాలలో కలిగి నిమజ్జనమనే పదానికి అర్థం, పరమార్థం లభిస్తుంది. ఆ దిశగా అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలా వచ్చే ఏడాదికైనా తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ 'గణపయ్య'కు టాటా చెబుదాం.
రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అల్లరి మూకలు చెలరేగకుండా నిఘాని కట్టుదిట్టం చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా సహించే ప్రశ్నే లేదు.
- సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి.
'నిమజ్జనోత్సవం' బందోబస్తు కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చారు. ఇక్కడి భాష, మాండలికం భిన్నంగా ఉన్నా అర్థం చేసుకునేందుకు యత్నిస్తూ సాగుతున్నాం. అయితే మేం మాట్లాడేప్పుడు కొందరు 'ప్రాంతీయ' వాదనలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. దీంతో భయంభయంగానే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి మేమోస్తే... తమపైనే దాడి జరుతుందేమోనన్న భావన కలుగుతుంది.
- ఎ.ఆర్‌. మహిళా కానిస్టేబుల్‌ (ఉత్తరాంధ్ర)
'లేనిపోని గొప్పలకు పోవటంవల్లే తిప్పలు పడాల్సి వస్తోంది. సందడిగా జరిగే నిమజ్జోత్సవాన్ని చూడాలని ఉన్న దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదం జాలంతో ప్రభుత్వం ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా, 'జనం'లోని భయాన్ని పోగొట్టలేక, ఉన్నంతలో అన్ని ఛానల్లో నిమజనాన్ని ప్రసారం చేసు ్తన్నాయి. అందులో టీవీలకు పరిమితమైతేనే బెటర్‌.
- ఎంవిఎస్‌ లక్ష్మి , గృహిణి, హైదరాబాద్‌
హైదరాబాద్‌ మహానగరంలో అత్యంత ప్రతిష్టాకరంగా జరిగే నిమజ్జనోత్సవం మా పోలీసు శాఖకి వార్షిక పరీక్ష లాంటిదే. ఇప్పటికే అన్ని శాఖలనీ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేశాం. నగరంలోని 15 వేల మంది పోలీసులకి తోడుగా ఇతర జిల్లాలనుంచి మరో 10 వేల మంది పోలీసుల్ని రప్పించాం. 35 బాంబ్‌ డిస్పోజబుల్‌ టీంలు, 40 యాక్సెస్‌ కంట్రోల్‌ టీంలో, 30 స్నిఫర్‌ డాగ్స్‌ని నియమించి ఎక్కడి కక్కడ మెటల్‌ డిటెక్టర్లు, యాంటీ సాబోటేజ్‌ టీంలతో... 1000కి పైగా నిఘా
కెమేరాలతో భద్రతని పర్యవణంక్షిస్తున్నాం
- ఏకే ఖాన్‌, నగర పోలీస్‌ కమిషనర్‌, హైదరాబాద్‌.
ఈ వాతావరణాన్ని, నీటిని కాలుష్యం చేసే హక్కు ఎవ్వరికీ లేదు.. చేస్తే ఓ రకంగా నేరమే.. రోడ్డుమీద చెత్తవేస్తేనే పెనాల్టి వసూలు చేయాలని చట్టాలు వచ్చిన ఈ తరుణంలో నీటి కాలుష్యం చేస్తున్నా, ఓ మతపరమైన తంతుగా భావించి ఏం చేయలేకున్నాం. ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ప్రభుత్వంపైనా, స్వచ్ఛంద సంస్థలపై ఎంతైనా ఉంది.
-ఎం.గౌరీపతి శాస్త్రి (అడ్వకేట్‌)
గణపతి మండపాల ఏర్పాటులో ఉత్సాహం చూపే నిర్వాహకులు 'నిమజ్జనం' అనంతరం 'ప్రక్షాళన' పై దృష్టి సారించకపోవటం విచారకరం. తొమ్మిది రోజుల గణనాధుని కోసం వెచ్చించిన వారు ఓ రోజు శ్రమదానం చేస్తే చెరువులే కాదు సముద్రమే ప్రక్షాళన అవుతుంది.
- ఎ.నాగార్జున, ఇంటీరియల్‌ డిజైనర్‌, హైదరాబాద్‌.