15, నవంబర్ 2011, మంగళవారం

గురువు ప(బ)రువెంత?

'గురుబ్రహ్మా! గురుర్విష్ణో! గురుర్దేవో మహేశ్వర:!
గురు సాక్షాత్‌ పరబ్రహ్మా తస్మైశ్రీ గురువేనమ:!''
బ్రహ్మ ప్రాణుల్ని సృష్టిస్తే...వాటిని పోషించే పని విష్ణువు చేస్తున్నాడు. ఈశ్వరుడు పనికిరాని వాటిని లయిస్తుంటే, గురువు జ్ఞానబోధన ద్వారా విజ్ఞానుల్ని రూపొందిస్తు...మనిషిని సజ్జనుడిగా.. సంపూర్ణ మానవులుగా తీర్చిదిద్దుతు త్రిమూర్తులతో సమానంగా అత్యున్నత స్థానాన్ని పొందాడు గురువు! మరి నేటి సమాజంలో గురువు పాత్ర అవతరణ నేపథ్యం పరిశీలించాల్సిందే!
పని విభజన : మానవుడు వ్యవసాయం నేర్చాక సవాలక్ష వస్తువుల అవసరత ఏర్పడింది. వీటిని ఎవరికి వారే చేసుకోవటం అసాధ్యం గనుక, నాటి సమాజంలో అంతా ఆలోచించి పని విభజన చేసారు. కొందర్ని పంటలు పండించటానికి,వస్తువుల ఉత్పత్తికి కొందర్ని, కుండల, చెప్పుల, బట్టల తయారీ ఇలా పని విభజించి తయారుచేసిన వస్తువులను పరస్పరంఅందజేసుకుంటూ.. తమ అవసరాలు తీర్చుకోగలిగారు
అయితే పిల్లలకు సంస్కారం నేర్పి ప్రయోజనకారులుగా చేసేందుకు గ్రామంలో అనుభవం, జ్ఞానం, శీలం కల్గిన మేధావులకు గురు బాధ్యతలు అప్పగించారు. పిల్లలందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యతను బాధ్యత గురువుది కాగా... ఆయనకు నిత్యావసరాలను గ్రామస్తులే సమకూర్చేవారు. అలా అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు గా సమాజంలో అలా ప్రవేశించింది గురువు పాత్ర!
'గురు'తర బాధ్యత : నాటి గురువు నుండి గ్రామం లోని పిల్లల్ని తన సొంత బిడ్డల్లా చేరదీసి, వ్యవసాయ విధానాలపైనా పలు వస్తూత్పత్తి పద్ధతులన్నింటినీ నేర్పేవాడు. విద్యతోబాటు, సత్యం, న్యాయం, ధర్మం, సర్వమానవ సమానత్వం, సోదరభావం మొదలగు ఉన్నత సామాజిక విలువలను, దయ, కరుణ,ప్రే మ, త్యాగం, శీలం వంటి ఉత్తమ మానవతా విలువలను నేర్పుటద్వారా గురువు తన శిష్యుల నిటు స్వప్రయోజకులుగాను, అటు సామాజికోద్ధారకులుగాను, తీర్చిదిద్దే వాడు. అంతేగాక విరామ సమయాలలో ప్రకృతిని పరిశీలిస్తూ, ప్రకృతి వైపరీత్యాలకు, గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలకు కారణాలను అన్వేషిస్తూ, వాటికి పరిష్కార మార్గాలు వెతుకుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువు ప్రకృతికి, ప్రా ణులకు మధ్యగల అవినాభావ సంబంధాన్ని గ్రహించి, ప్రకృతితో సామరస్యంగా మెలగాల్సిన ఆవశ్యకతపై ప్రజలను చైతన్య వంతుల్ని చేసేవాడు.నాడు గురు వు నిర్వహించిన గురుతర బాధ్యతే.. సమున్నత స్థానం కలిపించింది.
గురుకులాలు : సమాజ పరిణామ క్రమంలో తమ శిష్యులకు విద్యలో ఏకాగ్రత కోసం అరణ్యంలో పచ్చని ప్రకృతి నడుమ గురుకులాలు వెలిసాయి. ఇందులో పరిసర గ్రామాల పిల్లలే కాకుండా రాజ వంశీకులు కూడా చేరే వారు. వీటి నిర్వహణని రాజులు చేపట్టడమే కాక, క్రూరమృగాల బారి నుండి రక్షణ కల్పిస్తుండేవారు. గురుకులాధిపతులు తన చెంత కొచ్చిన పిల్లలందరికీ తన ఆశ్రమ పరిధిలోనే వ్యవసాయంపైనే కాకుడా వివిధ యుద్ద్ధ విద్యలను కూడా నేర్పి ప్రయోజకుల్ని చేసి పంపేవారు.
సమస్త మానవ కళ్యాణం కోసం తపస్సు కూడ చేసే గురుకులాధిపతుల తపోఫలితాలే ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఆరోగ్య, ఆయుర్వేద, గణిత, ఖోగోళ, వాస్తు, శిల్ప, సంగీత, సాహిత్య, శాస్త్రాలు అని చెప్పక తప్పదు.
గురుపూర్ణిమ: సమాజ హితం కోసం ఒకే రాశిగా ఉన్న వేద శ్లోకాలను నాలుగు వేదాలుగా విభజించి, వీటినర్థం చేసుకొనేందుకు బ్రహ్మసూత్రాలను వ్రాసాడు వ్యాసమహర్షి. పలునీతి కథలతో పురాణాల ను, పంచమవేదమైన మహాభారతాన్ని రచించిన ఆ మహర్షి. మానవసేవే మాధవ సేవ, కష్టాలు కలకాలముండవు! ధర్మమే జయిస్తుంది.! అధ ర్మం నశించి తీరుతుందనే సత్యాలతో భగవద్గీతను అందిం చాడు. అందుకే వ్యాసుడు జన్మించిన ఆషాడ పూర్ణిమ నాడు ''ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే!'' అంటూ వ్యాస పూర్ణిమ! గురుపూర్ణిమగా జరుపుకుంటారు.
గురుపూజోత్సవ దినం: నేటి ఆధునిక భారతం ప్రతి ఏటా సెప్టెంబర్‌ 5న మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజుని ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటోంది. 1888 సెప్టెంబర్‌ 5న తమిళ నాట 'తిరుత్తని' పుణ్యక్షేత్ర ప్రాంతంలో పుట్టిన రాధాకృష్ణన్‌, 'తిరుపతి'లో ఉన్నత విద్యావంతుడై.. కళాశాల ఉపన్యాసకునిగా తన అధ్యాపక జీవితాన్ని ప్రారంభించి, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆచార్యుని గా, ఆంధ్రా, కాశీ విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షునిగా పనిచేసారు. నానాజాతి సమితిలోని మేధావుల సహకార సంఘ సభ్యునిగా, ఐరాసలో విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక విభాగంలో భారత ప్రతినిధిగా రష్యాలో భారత రాయబా రిగా ఎదిగిన ఆయన, భారతదేశానికి ఉప రాష్ట్రపతిగా, తదుపరి రాష్ట్రపతి గానూ ప్రశంసనీయమైన సేవలందించ డమే కాక తనవ్యాసాలు, గ్రంథాలు, ప్రసంగాల ద్వారా భారతీయ తత్వశాస్త్రానికి ప్రపంచ ఖ్యాతినార్జించి పెట్టారు!
'వ్యక్తి చైతన్యం'లో దాని కంటే గొప్పదైన 'విశ్వచైతన్యం' పనిచేస్తూ వుంటుంది! అందుకే మనిషి సదా తన సంకుచి త స్వరూపాలకు అసంతృప్తుడౌతూ, తన లోపాలకు, తప్పులకు తనకు తానే న్యూనతాభావానికి లోనౌతూ ఉండటం కనిపిస్తున్నది! అందుకే మానవుడు సంకుచిత తత్వం నుండి, విశాల తత్వానికి, మానవస్థాయినుండి, అతీత మానవస్థాయికి ఎదగాలన్న నిగూఢ సత్యాన్ని సమస్త మానవాళికీ తెలియచేసిన డా సర్వేపల్లి రాధాకృష్ణ... ఒక ఉపాధ్యాయునిగా కేవలం విద్యార్థులకే పరిమితం కాక విశ్వ వ్యాప్త ఖ్యాతి నార్జించారు. ఆయనకు ఉపాధ్యాయ లోకం ఇచ్చే ఘన నివాళికి గుర్తుగానే ప్రతి ఏటా ఆయన జన్మదినాన్ని ఉపాధ్యయ దినంగా జరుపుకుం టున్నారు.
అయితే నేటి తరంలో గురువుకు విద్యార్ధులకు నడుమ ఆత్మీయత కొరవడింది. సాంకేతిక, సమాచార విప్లవాల నేపధ్యంలో విద్య వ్యాపారంగా మారింది. దీంతో ఏదై నా విజయం సాధించట మ లక్ష్యంగా మారి విలువలు తగ్గినట్లు అప ప్రదకి తోడుగా స్వయం ప్రగతి కోసమే తప్ప, ఇరుగుపొరుగు వారి కోసం దేశం కోసం ఆలోచించటమే మానివేసిన ఫలితంగా ఓనాడు ప్రపంచా నికే ఆదర్శంగా నిలిచిన మనదేశం నేడు అవినీతిలో, హెచ్‌ఐవి లాంటి రోగాలలో అగ్రస్థానమంటే..ఇంతకన్నా సిగ్గుచేటు అయిన విషయం ఏమైనా ఉందా?
ఉపాధ్యాయుడు చేసే తప్పుకు ఒక జాతి భవితవ్యమే నాశన మైపోతుందని అనుభవజ్ఞులు ఎలుగెత్తి చాటుతున్నా... ఉపాధ్యాయుడు సెతం వ్యాపారిగా మారిపోటానికి వ్యవస్థ ప్రభావమేనన్నది వాస్తవం. అయితే... సమాజం భవిష్యత్‌ని సరైన మార్గ్గంలో నడిపించాల్సిన బాధ్యత ఏనాటికైనా గురువుదే అనటంలో సందేహం లేదు. నేటి వ్యవస్ధల్లో ని లోపాలను సరిదిద్దుతూ... చెడును పార ద్రొలే గురుతర బాధ్యతని స్వీకరించి... సొంత ఆశల కోసం కాక, మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ... ఆశయాల కోసం జీవించా ల్సిన తరుణం ఆసన్నమైందన్న వాస్తవాన్ని గుర్తెరిగాలని...
''కారు, కారు గురువులు, కా గుణితములు జెప్పు,
శాస్త్ర పాదములను చదిలి చెప్పు,
ముక్తి మార్గము చూపు మూలము గురుడయా!
విశ్వదాభిరామ, వినుర వేమ!'' -
ఈ సమాజంలోని తక్కిన వారందరికన్నా గురుతరమైన బాధ్యతను నిర్వర్తించగలిగిన పెద్దవాడే 'గురువు' అని అని ప్రజాకవి వేమన చెప్పినట్లు విద్యార్థుల్ని, సామాజికుల్ని గూడ చైతన్య వంతులను చేయగలగాలి! ఉపాధ్యాయులు,ఈ గురుతర కర్తవ్య నిర్వహణకు పూనుకున్ననాడు ఈ ప్రమాదకర వ్యాపార వ్యవస్థను నిర్మూలించుకొని, మంచికి, మానవతకు, సమత, మమతలకు నెలవైన మహోన్నత సమాజాన్ని నిర్మించుకోగలం! వివేకానందుడన్నట్లు మనకంటూ, మనదంటూ చెప్పుకునే ఘన వారసత్వాన్ని మన భావితరాలవారికి, మన భరతమాత ద్వారా ప్రపంచానికే అందించగలం:ఉపాధ్యాయ సోదరులారా 'వ్యాసగురువు'లా.. డా రాధాకృష్ణన్‌ లా కేవలం మీ విద్యార్థులకే గాక, ఈ సమాజానికే గురువులుగా ఎదగండి!